అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రెండు నెలలకే మళ్లీ లోక్సభ సమరానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆ ఎన్నికల వేళ.. నాడు అధికారంలో ఉన్న కేసీఆర్, ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డిల పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఇప్పటికే పార్టీలన్నీ ఆ దిశగా కార్యాచారణ ప్రారంభించాయి. తెలంగాణలోని 17 సీట్లలో మెజారిటీ సీట్లు సాధించేందుకు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరే లోక్ సభ ఎన్నికల్లోను సత్తా చాటాలని రేవంత్ రెడ్డి భావిస్తుండగా… లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటి.. కాంగ్రెస్ విజయం పాల పొంగు మాత్రమే అని చాటి చెప్పాలని బీఆరెస్స్ భావిస్తోంది. అయితే… ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటివరకూ కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ కీ హాజరుకాలేకపోయారు. తుంటికి ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉన్నారు. అయితే… ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్… అందులో భాగంగా పార్టీ వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తానని ప్రకటించారు. ఇటీవల ఆయన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన బీఆరెస్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా అధ్యక్షత వహించారు. ఈ సమయంలో బీఆరెస్స్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరి అవసరం లేకుండా గట్టిగా పోరాడగలదని, పోరాడదాం అని పిలుపునిచ్చారు. అంతేకాదు.. ప్రజల్లోనూ ఆదరణ ఎక్కడా తగ్గలేదని చెప్పారు. త్వరలోనే జిల్లాల పర్యటన చేస్తానని, ఈ మేరకు ప్రణాళికలు రచించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ లో ఉత్సాహం పెరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా.. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి.. జనానికి చేరువయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సీఎం ఇంద్రవెల్లి, కొడంగల్ పర్యటనలు ఖరారయ్యాయి. పిబ్రవరి 2న ఉదయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉన్న నాగోబా దేవాలయాన్ని ఆయన సందర్శిస్తారు. అదేవిధంగా అమరుల స్మారక స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఓడిపోయిన అనంతరం బీఆర్ ఎస్ చేస్తున్న రాజకీయాలపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు రేవంత్ సిద్ధం అవుతున్నారు. అలాగే.. ఆరు గ్యారెంటీల అమలుల్లో ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ప్రచార అస్త్రంగా ఉపయోగించనున్నారు. ఎన్నికల ప్రచార సభలోనే మరో రెండు గ్యారెంటీలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. 14 సీట్లలో విజయం సాధించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సమావేశాల్లో నేతలతో చర్చించారు. ఆ దిశగానే రేవంత్ సభలు ఉండేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ బలనిరూపణకు సిద్ధం అవుతున్నాయి. భారీ స్థాయిలో జనసేకరణకు ఆయా పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ