తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిగ్రీ, పీజీ పరీక్షలు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ పరీక్షలను పూర్తిగా రద్దుచేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. జూన్ 18, గురువారం నాడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యా శాఖ అధికారులు, యూనివర్సిటీల ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల రద్దుకే మొగ్గు చూపూతూ వారంతా ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.
డిగ్రీ, పీజీ, బీటెక్, బీఫార్మసి కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేయడం, అలాగే చివరి ఏడాది చివరి సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి, పట్టాలు అందించే విషయంపై చర్చించారు. ఒకవేళ రద్దు నిర్ణయం వెలువడితే ఎలాంటి పరీక్షలు లేకుండానే మిగతా సెమిస్టర్ల మార్కులను బట్టి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పట్టాలు పుచ్చుకునే అవకాశముంది. అయితే పరీక్షల రద్దు, తదితర సంబంధిత అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పరీక్షల రద్దుకు ప్రభుత్వం నిర్ణయిస్తే ఉస్మానియా, జేఎన్టియూ-హైదరాబాద్, కాకతీయ, ఇతర యూనివర్సిటీలకు చెందిన లక్షల మంది విద్యార్థులు పట్టాలు అందుకునే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu