మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యతను, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్ కితాబునిచ్చారు. ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఈ ఎనిమిదేళ్ల స్వల్ప కాలంలోనే అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించడం అభినందనీయమన్నారు. ఒక వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రెండు రోజుల కిందట వచ్చిన తాను ఇక్కడ జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూశానన్నారు. బంజారాహిల్స్ లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయాన్ని శనివారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలతో కలిసి జమా ఖాన్ సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, సొసైటీ కార్యదర్శి షఫీవుల్లాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, ఉన్నతికి 9వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణలో లౌకిక ప్రభుత్వం కొనసాగుతున్నదని, ఇక్కడ అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారని, గంగా-జమున తహజీబ్ కిది నిలువుటద్దమన్నారు. విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ యువతకు 20 లక్షల చొప్పున ఉచితంగా ఇస్తామని చెప్పారు. పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు షాధీ ముభారక్ పథకం కింద లక్షా 16రూపాయలు అందజేస్తుండడంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గి చక్కగా చదువుకుంటున్నారని వివరించారు. ఇమామ్, మౌజంలు 10వేల మందికి 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామని పేర్కొన్నారు. మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా 204 గురుకుల పాఠశాలలు నడుపుతున్నామని, వీటిలో లక్షా 31వేల మంది బాలబాలికలకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. వీటిలో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని, క్రీడల్లో రాణిస్తున్నారని, అమెరికాలోని నాసా కేంద్రాన్ని కూడా సందర్శించారని తెలిపారు. క్రమశిక్షణతో, ఉన్నత ప్రమాణాలు, విలువతో ముందుకు సాగుతున్న ఈ పాఠశాలలను దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సందర్శించి ప్రశంసలు గుప్పించారని ఖాన్, షఫీవుల్లాలు వివరించారు.
ఈ సందర్భంగా బీహార్ మంత్రి జమాఖాన్ మాట్లాడుతూ, ఇక్కడ విజయవంతంగా అమలవుతున్న పథకాల గురించి తమ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వివరిస్తానన్నారు. రెండు మూడు నెలల తర్వాత తిరిగి ఇక్కడకు వచ్చి, గురుకుల పాఠశాలలను సందర్శిస్తానని, వీటిని ఆదర్శంగా తీసుకుని బీహార్ లో కూడా అమలు చేస్తామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY