ఏమాట కామాటే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లోనైనా నాయకులు నిజాలు ఒప్పుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఇవాళ అసెంబ్లీలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(బీఆర్ఎస్) జీరో అవర్లో మాట్లాడుతూ.. మేము బాగా పనిచేయనందునే ప్రజలు మా ప్రభుత్వాన్ని ఓడించారు. మీరు మాలా మారకండి. మేము బాగా చేయలేదనే మీకు కదా మీకు అధికారం వచ్చింది. మమ్మల్ని ఎగతాళి చేస్తే మీకూ మా గతి పడుతుంది అంటూ నిష్టురమైనా.. నిజాన్ని మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా మేం బాగా పనిచేయలేదని ప్రకటించడంపై మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు.
కాలేరు అసెంబ్లీలో మాట్లాడుతూ.. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నగరంలోని సమస్యలు ప్రస్తావించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ దుస్థితి.. జీతాలివ్వలేని పరిస్థితి గురించి వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.1200 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దాంతో ఒక్కో పనికి 20 సార్లు టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరన్నారు.ప్రభుత్వం కనీసం రూ. 1000 కోట్లయినా ఇచ్చి జీహెచ్ఎంసీని ఆదుకోవాలని కోరారు. అప్పుడు మాత్రమే నగరంలో అభివృద్ధి పనులు జరగగలవన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేరని,కాంగ్రెస్ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తూ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఖర్చు చేసున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. అందుకు స్పందిస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, అధికారులు ప్రొటోకాల్ను పాటించేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జీరో అవర్లో మాట్లాడిన సభ్యుల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(బీజేపీ) మాట్లాడుతూ, గత పాలకుల వల్ల తమ నిజామాబాద్ దారుణంగా తయారైందన్నారు. పట్టణంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లకింద కేటాయించిందని, తమ నియోజకవర్గానికి అంతకు రెట్టింపు 7000 ఇళ్లు ఇవ్వాల్సిందిగా కోరారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(బీఆర్ఎస్) మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన నియోజకవర్గంలో 18021 మందికి దళితబంధుకింద ఉపాధి కల్పించిందన్నారు. రెండో విడత 2800మదిని ఎంపిక చేశారని, వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. అవి రానందున నిరుద్యోగులు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిధులు బ్యాంక్ ఖాతాలకే నేరుగా అందుతాయి కనుక అవినీతికి ఆస్కారం లేదని, వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.నిర్మాణం పూర్తయిన ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలన్నారు. తమ బీఆర్ఎస్ హయాంలోనే 2 లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షలకు పైగా ఉద్యోగాలివ్వాలని కోరారు.
అలాగే.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇంట్లో ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పంపిందన్నారు. తమ నియోజకవర్గంలో మిషన్ భగీరథ అమలు జరగలేదని తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి (కాంగ్రెస్) తమ ప్రాంతంలో టెక్స్టైల్పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు అహ్మద్బలాలా(మలక్పేట), జాఫర్హుస్సేన్(యాకుత్పురా), జాఫర్అలీ(చార్మినార్), గండ్ర సత్యనారాయణ(భూపాలపల్లి), తదితరులు మాట్లాడారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY