నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. రాజధాని ఏంటో తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఉపయోగించుకోకుండానే.. హడావిడిగా పాలనను అమరావతికి షిప్ట్ చేసేశారు. తాత్కాలిక నిర్మాణాలతో రాజధాని అమరావతి అని ప్రకటించారు. కార్యాలయాలన్నీ తరలించేశారు. కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది. కానీ.. ఐదేళ్లలో కనీసం పదోవంతు కూడా రాజధానిగా ఆ ప్రాంతం రూపాంతరం చెందలేకపోయింది. పాలనాపరమైన వ్యవహారాలు ఎలాగున్నా.. రాజధానిలో ఉండేలా కనీసస్థాయిలో కూడా ప్రజాకార్యకలాపాలు మొదలుకాలేదు. ఏపీ రాజధాని అమరావతి అని ప్రపంచానికి పూర్తిగా తెలియక ముందే.. పాలన మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. శాసనరాజధానిగా అమరావతి, ఖర్నూలు న్యాయరాజధానిగా, విశాఖపట్టణాన్ని పాలనా రాజధానిగా ప్రకటించారు. అమరావతి నుంచి ఒక్క కార్యాలయం కూడా తరలించే అవకాశం లేనప్పటికీ.. అదిగో.. ఇదిగో అంటూ ఐదేళ్లుగా మభ్య పెడుతున్నారు. ప్రతీ దసరాకు కార్యాలయాల తరలింపు వ్యవహారంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ.. ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ తరలించింది లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా నాలుగో రాజధాని ప్రస్తావన మొదలైంది. నాలుగు ఏంటని కంగారుపడకండి.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు పొడిగించాలని వైసీపీ పెద్దలు కొత్త ప్రస్తావన తెరపైకి తెచ్చారు. దీంతో తెరపైకి నాలుగో రాజధాని అని సోషల్మీడియాలో వ్యంగ్యంగా ప్రచారం మొదలైంది.
వైసీపీలో కీలక నేత, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఈ ప్రస్తావన తెచ్చారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టం చేశారు. ఆ గడువు ఈ జూన్తో ముగిసిపోతుంది. రాష్ట్రంలో మళ్లీ వైసీపీయే అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రిగా జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభిస్తారు. ప్రస్తుతం కొత్త రాజధానిని నిర్మించే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు అమరావతి నుంచి ఉద్యోగులంతా విశాఖ వస్తే వసతి కల్పించడం కష్టం. అందువల్ల… అన్నీ సమకూర్చుకునేంత వరకు కనీసం రెండేళ్లయినా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతాం. ఈ అంశం మా మేనిఫెస్టోలో కూడా ఉంటుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై రెండు రాష్ట్రాలలోనూ చర్చ మొదలైంది.
అయితే.. వైవీ అలా అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ సవరించే ప్రయత్నం చేశారు. మాకు బుర్ర లేదా.. ఉమ్మడి రాజధాని ఎందుకు అంటాం..!? విభజన హామీలు చాలా వరకూ నెరవేరనివి ఇంకా ఉన్నాయని వాటిని సాధిస్తామని మాత్రమే వైవీ చెప్పారని అన్నారని చెబుతున్నారు. తమ పార్టీ విధానం ఎప్పటికీ మూడు రాజధానులు అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సింది అని దాన్ని వదిలేసి అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయి ఏపీకి వచ్చారు అని విమర్శించారు. అలా కనుక జరగకపోయి ఉంటే ఈపాటికి ఉమ్మడి ఆస్తులతో పాటు అనేక అంశాలు ఒక కొలిక్కి వచ్చి ఉండేవి అన్నదే తమ పార్టీ ఆలోచనగా చెప్పుకొస్తున్నారు.
వైవీ వ్యాఖ్యలపై తెలంగాణలోని బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించారు. హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు ఒప్పుకోబోమంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీనిపై కూడా బొత్స స్పందిస్తూ అసలు ఆ ఉద్దేశ్యమే తమకు లేదు అంటే మళ్లీ ఈ మాటలు – సవాళ్ళు ఎందుకని ప్రశ్నించారు. విభజన జరిగినప్పటి నుంచీ ఇలా ఏపీ రాజధాని అంశం చర్చల్లో ఉంటోంది కానీ.. కొలిక్కి రావడం లేదు. అభివృద్ధి జరగడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY