తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. అందరికంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ఇటీవల మేనిఫెస్టోను కూడా ప్రకటించి రాజకీయాలను మరింత వేడెక్కించారు. అటు కాంగ్రెస్ కూడా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్తో పాటు ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టి జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న బహుజన సమాజ్ పార్టీ కూడా ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. తమ అభ్యర్థుల ప్రకటన కంటే ముందే.. బీఎస్పీ మేనిఫెస్టోతో జనాల ముందుకొచ్చింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మేనిఫెస్టోను విడుల చేశారు.
ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను ఆకర్షించేలా బీఎస్పీ మేనిఫెస్టోను రూపొందించారు. దొడ్డి కొమురయ్య భూ హక్కు పేరిట.. భమి లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో పండిన ప్రతి పంటకు మద్ధతు ధర కల్పిస్తామని చెప్పారు. రైతు బంధు తరహాలోనే.. రైతులకు బహుజన రైతు ధీమా పేరిట ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. అయితే ఆర్థికసాయం ఎంత అందిస్తారనేది మాత్రం వెల్లడించలేదు.
ఫూలే విద్యాదీవెన పథకం కింద విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ప్రతి మండలం నుంచి ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తామని పేర్కొన్నారు. కాన్షీ యువ సర్కార్ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆ ఉద్యోగాల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి ఏటా రూ. 25 వేల కోట్లతో ఆరోగ్య బడ్జెట్ ప్రవేశ పెడుతామని వివరించారు. భీం రక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి.. వృద్ధులకు, అనాధలకు.. వసతి, వైద్యం, ఆహారం ఉచితంగా అందిస్తామని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ