ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత దాదాపు 40 రోజులుగా జైల్లోనే ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు కు సంబంధించి కోర్టుకు విచారణలు వచ్చినప్పుడల్లా.. ఏం జరగబోతోందన్న ఉత్కంఠత అంతటా ఏర్పడుతోంది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదిస్తున్నప్పటికీ.. విచారణ కొలిక్కి రాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా మంగళవారం కూడా తీర్పు వాయిదా పడింది.
బెయిలు కు నిరాకరణ
నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారం కొనసాగిన వాదనలు ముగిసాయి. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీకోర్టు ధర్మాసనం.. తిరిగి విచారణను అక్టోబర్ 20 కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వాదనలు మిగిలిఉంటే.. రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ధర్మాసనం సూచించింది. కాగా.. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్ రోహత్గీ సుధీర్ఘ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17A వర్తించదని సీఐడీ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ అన్నారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు వాదనలు సాగాయి.
దాదాపు గంటన్నర సేపు ఆయన తుదివాదనలు వినిపించారు. వివిధ హైకోర్టులిచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. అవినీతిపరులను కాపాడేందుకు 17A అన్నది రక్షణ కవచం కాదని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు వర్తించకపోయినా IPCలోని అనేక సెక్షన్ల కింద అభియోగాలున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపు అనేది లేదని, అనేక దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ జరుపుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 17A సెక్షన్ తర్వాత అమల్లోకి వచ్చినా అది కచ్చితంగా ఈ కేసులో వర్తిస్తుందని బాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు ఇలాంటివి ఉపయోగిస్తున్నారని అన్నారు. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ గురించి అనేక సెక్షన్లు, తీర్పులను హరీష్ సాల్వే ప్రస్తావించారు.
ఇరు పక్షాల వాదనలు విన్నా సుప్రీకోర్టు ధర్మాసనం.. తిరిగి విచారణను అక్టోబర్ 20 కి వాయిదా వేసింది. ఈ క్రమంలో చంద్రబాబు ఇంకెంత కాలం జైలులో ఉండాల్సి వస్తుందనే చర్చ నడుస్తోంది. ఆయన అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నప్పటికీ.. చంద్రబాబు ధైర్యంగానే ఆయనను కలిసి వచ్చిన కొందరు కార్యకర్తలతో పేర్కొంటున్నారు. అయితే.. ఈ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందో.. మున్ముందు ఏం జరగబోతుందో టీడీపీ లో చర్చ నడుస్తోంది.