తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు 2022 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డు లభించింది. అఖిల భారత రైతు సంఘం ప్రకటించిన ఈ అవార్డును గురువారం సీఎం కేసీఆర్ తరపున తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందుకున్నారు. పంజాబ్కు చెందిన ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సంయుక్త్ కిసాన్ మోర్చా సభ్యుడు సత్నాం సింగ్ బెహ్రూ, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ అఖిల భారత సలహాదారులు సుఖ్ జిందర్ సింగ్ కాకా, రాచ్ పాల్ సింగ్ ఖల్సా, మీడియా కార్యదర్శి అవతార్ సింగ్ దుండా హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ అవార్డును మంత్రి నిరంజన్ రెడ్డికి అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మూసీ రివర్ బోర్డ్ మేనేజ్ మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, భారత రైతాంగ శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ మహాయజ్ఞం మొదలుపెట్టారని అన్నారు. దేశంలో అతిపెద్ద రంగం వ్యవసాయమని, ఇందులో విశేషమైన మార్పు రావాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. ఇక్కడి భూమిని, నీళ్లను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి మనమే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగగలదని, కానీ ప్రస్తుత విధానాలు అందుకు తగ్గట్టులేవన్నారు. ఆహారరంగంలో అతి గొప్ప ఉపాధి అవకాశాలు ఉన్నవి, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏవీ కనిపించవు. తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం చేసి కొత్త దారి చూపాలన్న తపనతో సీఎం కేసీఆర్ ఉన్నారు. దీనికి మేధావులు, రైతు నాయకులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 700 మంది పైచిలుకు రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోయింది. కానీ ఎక్కడో పంజాబ్ కు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రాల ఎల్లలు దాటి చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించారు. ఇది ఆర్థిక చేయూత మాత్రమే కాదు, రైతుల కష్టాలలో భాగం పంచుకునే ఒక గొప్ప సీఎంను కేసీఆర్ లో చూస్తున్నాం అని పంజాబ్ రైతు నాయకులు తెలిపారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ను పాలించిన యూనియనిస్ట్ పార్టీ (జమీందారా లీగ్) సహ వ్యవస్థాపకుడైన ఛోటూ రామ్ చరిత్రలో రైతులను గణనీయంగా ప్రభావితం చేసిన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. స్వాతంత్య్రం రాకముందే రెవెన్యూ సంస్కరణలు, మార్కెటింగ్ మరియు పంటలకు కనీస మద్దతు ధర కోసం, అలాగే ఆ ప్రాంతంలో వ్యవసాయ సంబంధిత పరిశ్రమలను బలోపేతం చేయడానికి చోటూ రామ్ అనేక చర్యలు తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ కు సర్ ఛోటూ రామ్ అవార్డు అందిస్తున్నట్టు పంజాబ్ రైతు నాయకులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE