తెలంగాణ లో అద్భుతంగా ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఉందని ఉపాధి హమీ పనుల పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం అభినందించింది. అలాగే నర్సరీలు, డంపింగ్ యార్డులు, హరిత హరం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, కల్లాలు, సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు ఉన్నాయని, ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హమీ పనుల తీరుతెన్నులను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం గురు, శుక్రవారాలు రాష్ట్రంలో పర్యటించింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి, ఆరుట్ల, ఇబ్రహీం పట్నం, పోల్కం పల్లి, రాయ పోల్ తదితర గ్రామాలలో ఉపాధి హమీ పనులు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించిన కేంద్ర బృందం, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసింది. మంత్రిని కలిసిన కేంద్ర బృందంలో, ఉపాధి హామీ పథకం జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అమరేందర్ ప్రతాప్ సింగ్, కన్సల్టెంట్ కిరణ్ కుమార్ పాండే తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా తమ పరిశీలనలో వెల్లడైన, తమ దృష్టికి వచ్చిన పలు అంశాలను ఆ బృందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పంచుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి హమీ పనులు తెలంగాణలో జరుగుతున్నాయని ఆ బృందం సభ్యులు మంత్రికి చెప్పారు. మస్టర్ రోల్, కూలీల పనులు, వాళ్లకు అందిస్తున్న సదుపాయాలు, పనుల నాణ్యత, నిర్వహణ అంతా బాగున్నాయని అన్నారు. ఇంత వేగంగా నిర్ణీత సమయానికి ముందే 13 కోట్ల ఉపాధి హామీ పని దినాలను పూర్తి చేసిన ఘనత కూడా తెలంగాణకే దక్కుతుందన్నారు.
తెలంగాణలో 18కోట్ల పని దినాల వరకు ఉపాధి హామీ పనులకు అనుమతి:
కేంద్రం ఉపాధి హమీ కోసం లక్షా వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్రం అపరిమితంగా, చేయదగి నంత మేరకు అవకాశం కల్పిస్తాం. ఇప్పటి వరకు 13 కోట్ల పనిదినాలు ఉండగా, వాటిని 18కోట్ల వరకు చేసుకునే వీలుంది. అంతకు మించి చేయగలిగితే కూడా అవకాశం ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి కి కేంద్ర బృందం హామీ ఇచ్చింది. మరో వైపు మంత్రి ఎర్రబెల్లి కేంద్ర బృందానికి పెండింగ్ నిధుల విషయం చెప్పారు. దీంతో ఇప్పటికే రూ.780 కోట్ల ఉపాధి హామీ పెండింగ్ నిధుల్లో, రూ.199 కోట్లు విడుదల చేసినట్లు, మరో రెండు మూడు రోజుల్లో రూ.140 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆ బృందం వెల్లడించింది. లేబర్, మెటీరియల్ కంపోనెంట్ నిధులను కలిపి మరిన్ని నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రికి హామీ ఇచ్చింది.
ఉపాధి హామీతో వ్యవసాయ అనుబంధానికి మరికొంత సమయం:
ఉపాధి హామీ పథకంతో వ్యవసాయ పనుల అనుబంధానికి మరికొంత సమయం పట్టవచ్చు. తెలంగాణలాగే మరో 8 రాష్ట్రాలు ఈ విధంగా కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మరికొంత సమయం పట్టవచ్చు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి కేంద్ర బృందం తెలిపింది. అయితే, ఈ విధంగా చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చెప్పారని, అల చేయడం వల్ల ఉపాధి హమీ పథకం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఆ బృందానికి వివరించారు. కేంద్ర బృందం ఇంకుడు గుంతలు, పశువుల, గొర్ల కొట్టాలు, పౌల్ట్రీ తదితర అనేక పథకాల అమలు తీరును పరిశీలించింది. అలాగే మిషన్ భగీరథ పనులను పరిశీలించినది. మిషన్ భగీరథ మంచిని నీటిని, ప్రజలకు పంపిణీ చేస్తున్న విధానాన్ని చూసి సంతోషం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఎర్రబెల్లి, అధికారులకు ప్రశంశలు:
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హమీ, గ్రామీణాభివృద్ధి పథకాలనే గాక, వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్న అధికారులు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, వారి ఉద్యోగ బృందాన్ని, పర్యవేక్షిస్తున్న మంత్రి ఎర్రబెల్లిని సైతం కేంద్ర పరిశీలన బృందం ప్రశంసించింది. తనను మర్యాద పూర్వకంగా కలిసిన కేంద్ర బృందాన్ని అభినందించి, సత్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి జ్ఞాపికను అందచేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ