తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జగిత్యాల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అలాగే జగిత్యాలలో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటుగా, నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్నీ కూడా సీఎం ప్రారంభించారు. అనంతరం మోతె శివారులో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
“తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు, దైవ భక్తి ఉన్న ప్రాంతం. ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాళేశ్వరం, ధర్మపురి, అనేక పలు పుణ్యక్షేత్రాలతో పాటుగా కొండగట్టు అంజన్న దేవాలయం ఇక్కడే ఉంది. కొండగట్టు అంజన్న సన్నిధికి హనుమాన్ భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. కొండగట్టు అంజన్న దేవస్థానం కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఉండేది. పక్కనే ఉన్న 384 ఎకరాల స్థలాన్ని దేవాలయానికి ఇచ్చాం. అంజన్న సన్నిధిలో 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. మహిమాన్వితమైన గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ వేదిక నుంచి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే నేను స్వయంగా వచ్చి ఆగమశాస్త్ర ప్రకారం, భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను” అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అలాగే రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. “ఈ దేశంలో, ఈ భూ ప్రపంచంలో రైతుబంధు ఇచ్చే రాష్ట్రం లేదు. రైతుబీమా ఇచ్చే దేశం లేదు. రైతుబంధు, రైతుబీమా ఇచ్చే ఒకే ఒక జాగా తెలంగాణ. చితికిపోయి, ఛిద్రమైన ఆగమైన తెలంగాణ రైతుల బతుకులు ఓ దరికి రావాలని, అప్పులు తీరాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు. అంతవరకే ఆగకుండా ముందుకెళ్లి ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయదు. ఎక్కడా లేనివిధంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే రంది లేకుండా, అమ్మిన పంటకు ఐదు రోజుల లోపునే, బ్యాంకులు డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇంకో ఐదు, పది రోజుల్లో రైతుబంధు పడుతుంది. ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉంది. అక్కడ నిర్ణయం తీసుకొని రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తాం. తెలంగాణ రైతాంగంలో అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్న వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని మనవి చేస్తున్నా” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE