వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వెంగళ్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాధికారులు హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
భారతీయ ప్రాచీన వైద్య విధానంకు పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా సమయంలో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద సెంటర్ గా మారిందని అన్నారు. వ్యాధి నిరోదక శక్తి పెంచుతున్న ఆయుష్ మందులను మరింత అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తెలిపారు. ఆయుష్ డిపార్ట్మెంట్ మీద గతంలో సుధీర్ఘ సమీక్షలు నిర్వహించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలని అమలు చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లోపతీ లాగానే ఆయుష్ లో ఉన్న విభాగాల్లో విద్యార్ధులు ఐదు సంవత్సరాలపాటు చదువుతున్నప్పుడు వారికి గుర్తింపు, గౌరవం దక్కేలా చూడాల్సిన భాద్యత మన మీద ఉందన్నారు.
ఆయుర్వేద, యునానీ, హోమియో, నాచురోపతి, యోగా అన్ని విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్ట్ ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయుష్ డిస్పెన్సరీ సెంటర్స్ అన్నింటిని వెల్ నెస్ సెంటర్ లుగా మార్చాలని ఆదేశించారు. ప్రస్తుతం 440 ప్రభుత్వ డిస్పెన్సరీలు, 394 ఎన్ఆర్ హెఛ్ఎం డిస్పెషరీస్ పని చేస్తున్నాయి. తక్కువ పేషంట్లు వస్తున్న డిస్పెన్సరీస్ అన్నిటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని తెలిపారు. పీహెఛ్సీ లోనే ఆయుష్ విభాగాలు కూడా ఉండేలా చూడాలని కోరారు. ఆయుష్ అభివృద్దికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని సూచించారు.
వైద్య విధాన పరిషద్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. భర్తీ చేయడానికి ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రమోషన్ చానల్ లో సమస్యలు లేకుండా నిబంధనలు తయారు చేయాలన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఖాళీ పోస్ట్స్ లను మెడికల్ బోర్డు ద్వారా నియామకాలు చేయడానికి ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పనిచేయని వారి మీద చర్యలు తీసుకొనేవిధంగా నిబంధనలు మార్చాలన్నారు. పబ్లిక్ హెల్త్ నుండి వైద్య విధాన పరిషద్ కి మార్చబడిన 15 హాస్పిటల్స్ లో ఇప్పటికే కొన్ని హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి అయ్యాయి. వాటిల్లో అవసరం అయిన డాక్టర్, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు.
ప్రతి హాస్పిటల్ కి అంబులెన్స్ ఉండాలి, సిటి స్కాన్, పూర్తి స్థాయి ల్యాబ్ లు ఏర్పాటు చేయాలి, అవసరం ఉన్న చోట్ల అన్ని వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలి. వాటికి ఆన్యువల్ మెయింటెనెన్స్ తప్పని సరిగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్యం అందించడం ఎంత ముఖ్యమో రోగులతో ఆప్యాయంగా మాట్లాడడం కూడా అంతే ముఖ్యం. ఏం చికిత్స అందిస్తున్నామో ఎప్పటికప్పుడు రోగికి, వారి బందువులకు అందించాలని, అందుకోసం పేషంట్ కౌన్సిలర్స్ ను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి హాస్పిటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసి వచ్చిన పేషంట్ ని గైడ్ చేయాలి అని మంత్రి తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ను సబ్ సెంటర్ నుండి పీహెఛ్సీ వరకు అన్నీ ఖాళీల వివరాలు అందజేయాలని మంత్రి కోరారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇన్ సర్వీస్ పీజీ చేసిన తరువాత వారి సేవలు వైద్య విధాన పరిషద్, డీఎంఈ ఆసుపత్రుల్లో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ పై కూడా మంత్రి సమీక్షించారు. మందుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని ఆదేశించారు. క్వాలిటీ టెస్ట్ చేయడానికి అవసరం అయిన ల్యాబ్, సిబ్బందిని పెంచాలని సూచించారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మందుల ధరలు ఉండేలా చూసుకోవాలని కోరారు. మందుల వివరాలు ఆన్లైన్ లో ఉండేలా చూడాలని, ప్రతి టాబ్లెట్ కి లెక్క ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu