రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన నూతన సచివాలయంలో తొలిసారిగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2వ తేదీ నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా నిర్వహించాలని సూచించారు.
ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లాల్లో నిర్వహణ ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులు విడుదల చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏ రోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు తెలియజేశారు. దశాబ్ది ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి భద్రపరచాలని, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపేలా పుస్తకాలను ముద్రించి ప్రజలకు అందజేయాలని సూచించారు. అలాగే వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరించేలా డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని, వాటిని ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ను దాటిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు పైబడి వస్తోందని తెలిపారు. ప్రాజెక్టులతో సాగు నీరు పుషలంగా అందుబాటులో ఉందని, కాల్వల్లోని నీళ్లతో వరి నాట్లు వేసుకొనే పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాగా వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసీ గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,05,601 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మ తదితర బీసీ, ఎంబీసీ కులాలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.లక్ష ఉచిత ఆర్థిక సాయాన్ని అందిస్తుందని ప్రకటించారు. దశాబ్ది వేడుకల సందర్భంగా ‘సఫాయన్నా- నీకు సలామన్నా’ అనే నినాదంతో వారిని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని, అందుకే వారు ఎటువంటి డిమాండ్ చేయకున్నా, వారిమీద గౌరవంతోనే జీతాలు పెంచుతున్నామని ప్రకటించారు. అలాగే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ‘గృహలక్ష్మి’ పథకం కొనసాగుతుందని, నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. దీంతోపాటు ప్రతి నియోజకవర్గానికి 1,100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ‘దళితబంధు’ పథకాన్ని అందించాలని, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి, దశలవారీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE