సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘అగ్నిపథ్’కి వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో వరంగల్ జిల్లా దబీర్పేట గ్రామానికి చెందిన 22 సంవత్సరాల డి. రాకేష్ అనే సైనిక ఉద్యోగార్థి మరణించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల వెనుకబడిన తరగతులకు చెందిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే అతని కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటనలో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ కు చెందిన శ్రీకాంత్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. యువకులెవరూ ఆందోళన చెందవద్దని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ