తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో నిర్మించిన కుమురంభీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి గిరిజనులు హాజరయ్యారు. కుమురంభీం ఆదివాసీ భవన్ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఆదివాసీ బిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ భవనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆదివాసీ భవన్ ను నిర్మాణం చేసుకున్నామని, ఆదివాసీ నాయకులు, మేధావి వర్గం ఈ భవనం వేదికగా ఆదివాసీల సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.
సేవాలాల్ బంజారా భవన్ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, యావత్ తెలంగాణ రాష్ట్ర బంజారా బిడ్డలందరికీ హృదయపూర్వకంగా, సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే మంత్రి సత్యవతి రాథోడ్ కు, బంజారా ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో గిరిజనులు ఎస్టీలుగా, మహారాష్ట్రలో బీసీలుగా, ఇంకో చోట ఓసీలు ఉన్నారని, అయితే దేశవ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి కూడా జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక రాష్ట్రంలో నెలకున్న పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసుకోబోతున్నామని అన్నారు. బంజారా ప్రజాప్రతినిధులంతా ముందుండి పోడు భూముల పరిష్కారంలో చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ క్రమంలోనే ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా ప్రత్యేక భవనాలను నిర్మించినట్టు ప్రభుత్వం తెలిపింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రూ.24 కోట్ల 68 లక్షల వ్యయంతో కుమురంభీం ఆదివాసీ భవన్ ను, రూ.24.43 కోట్ల వ్యయంతో సేవాలాల్ బంజారా భవన్ లను ఆధునిక వసతులతో ప్రభుత్వం నిర్మించింది. ఈ భవనాల్లో వేడుకలు,సదస్సులు, సమావేశాలు జరుపుకునేందుకు వీలుగా 1000 సీట్ల సామర్ధ్యం కలిగిన ఆడిటోరియంలను నిర్మించారు. కుమురంభీం ఆదివాసీ ఆత్మగౌరవ భవనాన్ని సెల్లార్ మరియు 3 అంతస్తులతో సేవాలాల్ బంజారా భవన్ ను 3 అంతస్తులతో నిర్మించారు. ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, కళలు, వేడుకలను తెలియజేసే లైబ్రరీ, ఆర్ట్ ఫాక్ట్ అండ్ పెయింటింగ్ ల ప్రదర్శనకు, మీడియాకు ప్రతి భవనంలో 4 సువిశాల గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రతి భవనంలో 3 వీఐపీ లాంజ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే 250 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్స్ ను నిర్మించారు. కుమురంభీం ఆదివాసీ భవనం ఆవరణలో 80 వాహనాలు పార్కింగ్ సదుపాయం వుంది. సేవాలాల్ బంజారా భవనము ఆవరణలో 35 వాహనాలు పార్కింగ్ కు అవకాశం వుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY