సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కంటోన్మెంట్ అధికారుల తీరు వలన హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారని తెలిపారు. నగర అభివృద్ధికి వారు అడ్డు పడుతున్నారని కంటోన్మెంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతవాసులు రోజువారీ ప్రయాణానికి ఉపయోగించే రోడ్లను మూసివేస్తున్నారని.. దీనిపై ఎన్నోసార్లు అభ్యంతరం వ్యక్తం చేశామని వెల్లడించారు. అయినా అధికారుల తీరు మారటం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టడం వలన దగ్గరలోని నదీం కాలనీ మునిగిపోతోంది. శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు విడుదల చేయాలని చూస్తుంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదు. ఒక వైపు కంటోన్మెంట్, మరో వైపు ఏఎస్ఐ నిర్ణయాలతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఉంటున్నప్పుడు కంటోన్మెంట్ కూడా స్థానిక ప్రజలతో, ప్రభుత్వంతో మమేకమై ఉండాలని అన్నారు. వారు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే మేము కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కంటోన్మెంట్ లో రోడ్లు మూసివేస్తే.. తాము కరెంటు, నీళ్లు ఆపివేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ