తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఫిబ్రవరి 18న ప్రగతిభవన్లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టాల్సిన పనులపై ఈ సదస్సులో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
పట్టణ ప్రగతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ నిర్దేశించిన రోడ్ మ్యాప్, మార్గదర్శకాలు:
=> వార్డుల వారిగా ప్రణాళిక తయారు చేయాలి. ప్రతీ పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక తయారు కావాలి. కౌన్సిలర్/కార్పొరేటర్లను కలుపుకుని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రణాళిక తయారు చేయాలి. వార్డుల వారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి. ప్రతీ వార్డును ఎక్స్ రే తీయాలి. ఏమి ఉన్నాయి. ఏమి లేవు. ఏమి కావాలి. ఏమి చేయాలి అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి.
=> మంచిపట్టణం/మంచి నగరం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. దానికి సమాధానాలు వెతుక్కుంటే ఏమి చేయాలో బోధ పడుతుంది. ప్రతీ రోజు చెత్తను, మురికిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన మంచినీరు సరఫరా జరగాలి. వీధి లైట్లు బాగా వెలగాలి. రహదారులపై గుంతలు, బొందలు, గోతులు ఉండకూడదు. పచ్చదనంతో పట్టణం కళకళలాడాలి. చెత్త నిర్మూలనకు డంప్ యార్డులు ఉండాలి. చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపేందుకు దహనవాటికలు/ ఖనన వాటికలు ఉండాలి. పట్టణ జనాభాను అనుసరించి పరిశుభ్రమైన వెజ్-నాన్ వెజ్- ఫ్రూట్ – ఫ్లవర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలి. పట్టణంలోని యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్ లు ఉండాలి.
=> వీధులపై వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్స్ కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ చేర్పాటు చేయాలి. వాటిలో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించే వరకు వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం తగు ఆదేశాలు ఇస్తుంది.
=> ప్రతీ పట్టణంలో ఉండాల్సిన కనీస పౌర సదుపాయాలు ఏమిటి అని నిర్ధారించుకుని వాటిని కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టణ ప్రజలకు, పట్టణాలకు వచ్చే ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి. దీనికోసం ప్రభుత్వ స్థలాలను వినియోగించాలి. ఏ శాఖకు చెందిన స్థలమైనా సరే ప్రజోపయోగం వినియోగించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు ఇస్తుంది. ఏ పట్టణానికి ఎన్ని టాయిలెట్లు, ఎక్కడ నిర్మించాలో నిర్ధారించుకుని మూడు నెలల్లో వాటి నిర్మాణం పూర్తి చేయాలి.
=> ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్క్ చేయడానికి పార్కింగ్ సదుపాయం కల్పించాలి. దీనికోసం కూడా ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారం కలెక్టర్లకు ప్రభుత్వం కల్పిస్తుంది.
=> ప్రమాద రహితమైన విద్యుత్ వ్యవస్థ కలిగి ఉండాలి. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్ పాత్ లపై ఉండే ట్రాన్స్ ఫారాలను మార్చాలి. ఇండ్లపై వేలాడే వైర్లను సరిచేయాలి. పొట్టి స్తంభాలను తొలగించి, పెద్ద స్తంభాలు వేయాలి. ఈ పనులన్నీ చేయడానికి అవసరమైన నిధులను ఈసారి బడ్జెట్లో కేటాయిస్తాం. ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. లేనట్లయితే దానికి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. కావాల్సిన పోళ్లను, తీగలను, ట్రాన్స్ ఫారాలను విద్యుత్ అధికారులు ముందుగానే సమకూర్చి ఆయా పట్టణాలకు పంపించాలి.
=> పల్లెల్లో సర్పంచుల మాదిరిగానే పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు స్వీకరించాలి. పెట్టిన మొక్కల్లో 85 శాతం బతికే బాధ్యతను వారు తీసుకోవాలి. ఆయా పట్టణాలకు అవసరమైనన్ని నర్సరీలను ఏర్పాటు చేయాలి. పట్టణంలో జాగా లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.
=> ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీ చేయాలి. ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైనన్ని వాహనాలు సమకూర్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 3100 వాహనాలు తీసుకోవాలని నిర్ణయించాం. ఇప్పటికే 600 వాహనాలు వచ్చాయి. మిగతావి త్వరలోనే వస్తాయి. ఇంకా అవసరం ఉన్న పట్టణాల్లో మరికొన్ని కొనుగోలు చేయాలి.
=> డ్రైనేజీలు శుభ్రం చేయడానికి అనేక రకాల మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఏర్పాటు చేసుకోవాలి.
=> పట్టణాలకు ప్రతి నెలా రూ.148 కోట్ల చొప్పున ఆర్థిక సంఘం నిధులు అందిస్తాం. ఇతర ఖర్చులు తగ్గించుకుని అయినా సరే, గ్రామాల అభివృద్దికి వెచ్చిస్తున్నట్లే, పట్టణాల అభివృద్ధికి నిధులు అందచేస్తాం. ఈ నిధుల వినియోగంలో క్రమశిక్షణ ఉండాలి. ప్రతీ మున్సిపాలిటీ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చును చార్జుడ్ అకౌంటుగా నిర్ధేశించుకోవాలి. అప్పులకు సంబంధించిన కిస్తీలు, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, మంచినీటి బిల్లులు ఖచ్చితంగా ప్రతీ నెలా చెల్లించాలి. ఇది కమిషనర్ల బాధ్యత. ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడే పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించాలి. ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను కూడా పట్టణాల ప్రగతికి వినియోగించాలి.
=> కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇండ్ల నిర్మాణం, లే అవుట్ విషయంలో సులభతరమైన అనుమతుల విధానం తెచ్చాం. ప్రజలపై నమ్మకం ఉంచాం. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
=> జీవో నెంబరు 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే, అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
=> తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది. ఇందులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి. ఎవరికి వారు పూనుకుని తమ ప్రాంతంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి.
సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్లు, చైర్ పర్సన్లతో ముఖాముఖి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పట్టణ పరిపాలన కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్ పర్సన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
[subscribe]