యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయం ‘పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ’ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం పర్వతవర్దిని సమేత శ్రీ రామలింగేశ్వర స్పటిక లింగానికి అభిషేకం నిర్వహించారు. శివాలయ మహా కుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో సీఎం దంపతులు పాల్గొన్నారు. ముందుగా సోమవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు తొలుత లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు వేదోచ్చారణతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో సీఎం దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు సీఎం దంపతులకు ఆశీర్వచనం అందించారు.
అక్కడనుండి నేరుగా ‘పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర ప్రధాన ఆలయానికి సీఎం దంపతులు చేరుకున్నారు. అక్కడ పూజారులు గర్తన్యాసము, సపరివార శ్రీ రామలింగేశ్వర స్పటిక లింగ ప్రతిష్ఠా మహోత్సవము, మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. అనంతరం అష్టబంధనం, ప్రాణ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమము, అఘోర మంత్ర హోమము, దిక్దేవతా క్షేత్రపాల బలిహరణము, కలశ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం సీఎం దంపతులు తిరిగి యాదాద్రి నుంచి బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతారెడ్డి, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, మాజీ మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, యాదగిరి గుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ