తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, అందుకే తమ వద్ద కూడా అమలు చేయాలని పక్క రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. మంగళవారం వికారాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన, నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని, బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమంలో చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకున్నామని, అదే స్ఫూర్తితో సిద్ధించిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఇక మన రాష్ట్రం ఒక్కటే బాగుంటే సరిపోదని, మొత్తం దేశం కూడా బాగుండాలని హితవు పలికారు.
ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి, వికారబాద్లలో భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు కర్ణాటకకు మించి ఇక్కడ భూముల ధరల పెరిగాయని తెలిపారు. వికారాబాద్కు మెడికల్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన అసలు తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఆడుకుంటున్నామని చెప్పిన ఆయన, రైతు బీమాతో రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నామని గుర్తు చేశారు. అలాగే కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని, ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి రూ.2016 ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు పేదింటి ఆడపిల్లల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు కూడా నెలకు రూ.3016 ఇస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 8 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని, సంస్కరణల పేరుతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నిన్న గంటకు పైగా మాట్లాడిన ప్రధాని, దేశానికి ఆయన ప్రభుత్వం చేసిందేంటో చెప్పలేదని విమర్శించారు. ఈరోజు నేను వికారాబాద్కు వస్తుంటే బీజేపీ జెండా పట్టుకొని ఆ పార్టీ వాళ్ళు నా బస్కు అడ్డం వచ్చారని, వికారాబాద్కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలని కోరారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఉచితాలని అంటున్నారని, ఇదేం రాజకీయమని కేసీఆర్ దుయ్యబట్టారు. అలాగే గతంలో గ్యాస్, పెట్రోల్ ధర ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత ఉంది? అని ప్రశ్నించారు. ఇక బీజేపీ నేతలకు ధైర్యం ఉంటె ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలని, రాష్ట్రానికి నిధులు తేవాలని, కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY