75 ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ, నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం” ముగింపు వేడుకలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ముగింపు వేడుకల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, గాంధేయవాదమే తెలంగాణను సాధించిందని, గాంధీ అనుసరించిన శాంతి, అహింస, సౌభ్రాతృత్వ భావనల కొనసాగింపే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలతో సహా, భాగస్వాములైన జిల్లా కలెక్టర్లను, అన్నిశాఖల అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.
పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి:
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల అపురూప ఘట్టాన్ని ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. పదిహేను రోజులపాటు తెలంగాణ నిర్వహించిన తీరు యావత్ దేశాన్ని ఆకర్షించిందని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నామన్నారు. “స్వతంత్రం వచ్చి 75 ఏండ్లయినా, దేశం అనుకున్నంతగా పురోగమించలేదు. విద్వేష శక్తులు కులం, మతం పేరుతో దేశ ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ మౌనం వహించడం కరెక్టు కాదు. మేధావి వర్గం అర్ధమైనా, అర్ధంకానట్లు వ్యవహరించడం సరికాదు. అద్భుతమైన ప్రకృతి సంపద, మానవ వనరులున్నయి. పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలి” అని అన్నారు.
“జాతిపిత మహాత్మా గాంధీ గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడారు. గాంధీ గురించి ప్రపంచమే గొప్పగా చెబుతుంది. ఈ అల్పుల మాటలు ఎంత?, గాంధీ సినిమాను 22 లక్షలమందికి పైగా పిల్లలు చూశారు. నాకెంతో గర్వంగా, సంతోషంగా ఉన్నది. ఇందులో 10శాతం పిల్లలు గాంధీని ఆదర్శంగా తీసుకున్నా దేశం ఎంతో పురోగమిస్తుంది. స్వాతంత్య్ర మూర్తి గురించి ఈ తరం పిల్లలకు తెలియాలనే ఈ సినిమాను చూపిస్తున్నం. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కోటి మందికిపైగా ఒకేసారి పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్లకు అభినందనలు. గాంధీ బాటలోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినం. రాష్ట్రాన్ని సాధించుకున్నం” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
జాతి గర్వించే ప్రముఖులకు, ప్రముఖుల వారసులకు సన్మానాలు:
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్ కుమార్ రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు, అంబేద్కరిస్టు అజయ్ గౌతమ్, కొమురం భీం వారసుడు కొమురం సోనేరావు, కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, వెయ్యి ఎకరాలకు పైగా భూములను దానం చేసిన భూదాన్ రాంచంద్రారెడ్డి తనయుడు అరవింద్ రెడ్డి, హరితహారంలో లక్షలాది మొక్కలు నాటిన వనజీవి రామయ్య, రావెల్ల వెంకట్రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మహ్మద్ హుసాముద్దీన్, సంగీత దర్శకులు శంకర్ మహదేవన్, కె.ఎం.రాధాకృష్ణ, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్, సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్ తదితరులను ఘనంగా సీఎం కేసీఆర్ సన్మానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY