దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇద్దరు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్ మరియు 54 పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి సోమవారం నలుగురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య (కళలు), ఆంధ్రప్రదేశ్ నుంచి గరికపాటి నరసింహారావు (సాహిత్యం మరియు విద్య), గోసవీడు షేక్ హాసన్ (కళలు), డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం)లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. గోసవీడు షేక్ హుస్సేన్కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించగా, ఆయన తరుపున మనవడు షేక్ హిలమ్ షా ఉద్దీన్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
అలాగే సోమవారం నాడు రాధే శ్యామ్ ఖేంకా (మరణానంతరం), జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం) తరపున వారి కుటుంబసభ్యులు పద్మవిభూషణ్ అందుకోగా, గులాం నబీ ఆజాద్, గుర్మీత్ బావా (మరణానంతరం), ఎన్ చంద్రశేఖరన్, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, రాజీవ్ మెహ్రిషి, డాక్టర్ సైరస్ పూనావాలా మరియు సచ్చిదానంద స్వామి పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. 2022 సంవత్సరానికి గాను నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ చెందిన వారు 10 మంది ఉండగా, 13 మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
మార్చి 21న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మొదటి సెట్ అవార్డులు ప్రదానం జరగగా, మార్చి 28న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-IIలో రెండవ సెట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇక మార్చి 28న తెలంగాణ నుంచి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల సంయుక్తంగా పద్మభూషణ్, సకిని రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు)లకు పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ