ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దీనిలో ప్రమేయమున్నట్లుగా భావిస్తున్న పలువురు వ్యాపారవేత్తలకు సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్ రావును సోమవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. ఈ కేసులో బోయినపల్లి అభిషేక్ రావు పాత్రపై కొన్ని కీలక ఆధారాలు లభించాయని, అందుకే ఆయనను అరెస్ట్ చేశామని, ఈరోజు కోర్టులో హాజరు పరుస్తామని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా ప్రస్తుతం ఆయనను ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. అయితే అభిషేక్ రావు స్టేట్మెంట్ను బట్టి ఈ కేసులో మరికొంత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసినవారి సంఖ్య రెండుకి చేరినట్లయింది. ఇదివరకు విజయ్ నాయర్ అనే వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈడీ కూడా సమీర్ మహేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన నేపథ్యంలో.. దర్యాప్తు సంస్థలు దీనిపై దూకుడుగా వెళ్తున్నాయి. అయితే ఇది కేంద్రప్రభుత్వం ప్రతిపక్షాలపై చేస్తున్న కక్షసాధింపు చర్యగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY