రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధ వంతంగా కట్టడి చేసేందుకుగాను తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా “సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ సంస్థలు, ఐఐటీ, ఐబీఎం లాంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ముందుగా గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో సైబర్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ అనే అంశంపై జరిగిన ఒక రోజు జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి ఐజీ రాజేష్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పౌసమి బసు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800లకు పైగా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సైబర్ వారియర్లుగా నియమించామని తెలిపారు. జిల్లా, కమిషనరేట్, రాష్ట్ర స్థాయిలోను సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ యూనిట్ లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మరో మూడేళ్ళలో దేశంలో సెల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య ఒక బిలియన్ కు చేరుకుంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరిదీ డిజిటల్ లైఫ్ అయిందని, ఇదే స్థాయిలో కూడా సైబర్ నేరాల గ్రాఫ్ కూడా గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని, తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని డీజీపీ పేర్కొన్నారు.
ఈ సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు గాను మొత్తం పోలీస్ వ్యవస్థనే పటిష్ట పరుస్తున్నామని తెలిపారు. దీనిలోభాగంగా ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ కోర్దినేషన్ సెంటర్ (T4C) ను ప్రారంభించామని తెలియచేశారు. ఇది నేర నిరోధంలో కీలక పాత్ర వహిస్తోందని అన్నారు. దేశంలోని అన్ని ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ డిజిటలైజ్ చేసినందున, ఇదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల నగరంలో ఒక బ్యాంక్ ద్వారా రూ.20 కోట్లు తరలించిన అంశాన్ని ఉదహరిస్తూ, మరో పదేళ్ళలో ఎదురయ్యే సైబర్ క్రైమ్ లను గుర్తించి దానికనుగుణంగా తగు నివారణను సూచించేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY