గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులతో ప్రయాణికులకు సేవలందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాలక్రమేణా కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై పరుగుపెట్టే అవకాశం ఉంది. ఇటీవలే నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ సంస్థ టెండర్ దాఖలు చేసి, టీఎస్ఆర్టీసీ అడిగిన మేరకు తొలిదశలో 25 డబుల్ డెక్కర్ బస్సులు సమకూర్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆర్థిక కమిటీ సమావేశమై డబుల్ డెక్కర్ బస్సుల ధరపై చర్చించనున్నారు. అనంతరం అశోక్ లేలాండ్ సంస్థ దాఖలు చేసిన టెండర్కు ఆమోద ముద్ర వేసే అవకాశమునట్టు సమాచారం. సాంకేతిక పరంగా ఉన్నతంగా, బీఎస్-6 ప్రమాణాలతో నగరంలో రోడ్లకు అనుకూలంగా డబుల్ డెక్కర్ బస్సుల తయారీ ఉండాలని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తుంది.
ముందుగా గత నవంబర్ నెలలో డబుల్ డెక్కర్ బస్సులను మళ్ళీ గుర్తు చేస్తూ ఓ యువకుడు మంత్రి కేటిఆర్ ను ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. ఒకప్పుడు జూపార్క్ నుంచి 7z నంబర్ తో అఫ్జల్గంజ్, హైకోర్టు మీదుగా సికింద్రాబాద్ వరకు తిరిగే డబుల్ డెక్కర్ బస్సులు ఎవరికైనా గుర్తున్నాయా? అని అడుగుతూ, మళ్లీ ఆ బస్సులను టూరిస్టులు/ప్రయాణికుల కోసం తీసుకురావాలని మంత్రి కేటిఆర్ను కోరుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, అబిడ్స్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్కు వెళ్లేటప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని, ఆ బస్సులపై తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆ బస్సులు రోడ్లపైకి రాకుండా ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని అన్నారు. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ హైదారాబాద్ రోడ్లపైకి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? పరిశీలించాలంటూ రాష్ట్ర రవాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రి కేటిఆర్ కోరారు. ఆ క్రమంలోనే నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ నడిపేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టెండర్లను ఆహ్వానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ