తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతూ ఉంది. జీహెఛ్ఎంసీ పరిధిలో ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బీజీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. అలాగే ఆయన కుమారుడికి కూడా కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం వారిద్దరూ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకినా కూడా తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆరోగ్యంగా బయటికి వస్తానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ఆయన సందేశం పంపినట్టు తెలుస్తుంది.
మరోవైపు కొత్తగా నమోదైన 196 కేసులతో కలిపి మే 31, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2264 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 82 కి చేరినట్టు తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 434 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 434 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,698 కి చేరింది. ఈ వైరస్ నుంచి కోలుకుని 1428 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 1188 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu