ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబందు పథకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ, హరిత తెలంగాణ, కోటి ఎకరాల మగాణాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన వెల్లడించారు. హరిత తెలంగాణ కళ్లెదుటే సాక్షాత్కరిస్తుందని, కోటి ఎకరాల మాగణం సస్యశ్యామలం అన్నది వరి దిగుబడి తేటతెల్లం చేసిందని, మిగిలిన దళిత తెలంగాణ కోసం దళిత బంధు రూపంలో అడుగులు పడ్డాయని ఆయన తెలిపారు. దళితబందు పథకం అమలులో బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న భువనగిరి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో దళితబందు లబ్ధిదారులకు ఆయన యూనిట్లు పంపిణీ చేశారు.స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రజారిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామంలో ఎంపిక చేసిన తొలి పదిమంది లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఒక నాడు తెలంగాణ ఒక స్వప్నం అని, కలలు కనే వాళ్ళు చాలా మంది ఉంటారని కానీ అవి నిజం చేసే వాళ్ళు కొందరే ఉంటారని ఆ కొందరు మహానుభావులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరని తెలంగాణ స్వప్నం నిజం చేసిన స్వాపనికుడు ఆ మహానేత అని ఆయన కొనియాడారు. అదే స్వప్నం దళిత బంధు అని ఆ స్వప్నం రేపటి నిజం అవుతుందని ఆయన చెప్పారు. దళితబందు కేవలం కుటుంబానికో పది లక్షలు ఇచ్చే పథకం ఎంత మాత్రం కాదని ఈ ప్రపంచానికి గొప్ప మార్గదర్శనం గా నిలబడే పధకంగా రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కొరకు ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలను కేంద్రంగా మార్చి 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాదించారో అదే పద్దతిలో దళితబందు పథకాన్ని ప్రపంచానికే ఓ రోల్ మోడల్ పధకం గా రూపొందించారని ఆయన చెప్పారు. ఇది ప్రగతిశీల ప్రభుత్వం అని అన్నివర్గాలను ఒప్పించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కుందని ఆయన పేర్కొన్నారు.
భిన్న వైరుధ్యాలతో ఉండే సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతూ ఆచరణలో దళితబందు పథకాన్ని విజయవంతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశంతో పాటు మరెన్నో దేశాలకు స్వతంత్రం సిద్దించినా అనతి కాలంలోనే ఎన్నో దేశాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. భారతదేశం ఇప్పటికి నిలదొక్కుకున్నది అంటే అందుకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. అందుకే మహాత్మాగాంధీ, అంబేద్కర్ ల కలల సాకారానికై ముఖ్యమంత్రి కేసీఆర్ తనకొచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అన్నార్తులు, అనాధాలు లేని అద్భుతమైన సమాజం నిర్మాణానికి పునాదులు వేస్తున్నారన్నారు. అందులో భాగమే దళితబందు పథకమని తద్వారా ఆర్థిక వెనుకబాటుతనంతో పాటు సామాజిక అంతరాలు రూపొందించేందుకు బ్రహ్మష్ట్రంలా ఉపయోగపడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో వచ్చిన రంజాన్ పండుగకు అధికారికంగా ఇఫ్తార్ ఇవ్వాలని నిర్ణయిస్తే అందరూ వణికిపోయారన్నారు. ఇఫ్తార్ మాత్రమే కాకుండ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకేసి రంజాన్ కు నూతన వస్త్రాల ప్రధానం అన్న రోజున చాలా మంది ఓట్లతో లెక్కలేసి ఆలోచనలు చేశారన్నారు. అయితే మనం చేసేది ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనదని బావించినందునే అందరిని ఒప్పించి ఒక్క రంజాన్ కే పరిమితము చేయకుండా క్రిస్మస్, బతుకమ్మలకు నూతన వస్త్రాలను అధికారికంగా అందజేసే సరికొత్త ఒరవడికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. అదే పద్దతిలో మొదలు పెట్టిన దళితబందు కూడా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణా ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాల్సిన సందర్భంలోనూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. నడిచేటప్పుడు సందేహాలు వ్యక్తం చేశారన్నారు. తెలంగాణా వస్తదో రాదో అన్న అనుమనపడ్డ వారి సంఖ్య కోకొల్లలు, రాకుండ అడ్డుపడ్డ వారు, కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు మోసాలు ఉండనే ఉన్నాయన్నారు. అన్నింటినీ పటాపంచలు చేయడమే కాకుండ వచ్చిన తెలంగాణలో తిరుగులేని ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనా దక్షుడిగా యావత్ భారతదేశంలో కీర్తింప బడుతున్న శుభసందర్బంలో మొదలుపెట్టిన పథకమే దళిత బంధు అని ఇది నిర్విరామంగా ప్రక్రియ అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ