తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోమవారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, రాజీనామా లేఖను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీలో కొనసాగలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి పెద్దిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
హుజురాబాద్ కు చెందిన పెద్దిరెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకునే విషయంలో తనను సంప్రదించలేదని పార్టీ నాయకులతో తీవ్రంగా విభేదించారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు తెలుస్తుండగా, తన రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. మరోవైపు రెండ్రోజుల క్రితం మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ