నల్లగొండ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ అభివృద్ధికి ఆఘమేఘాల మీద అడుగులు పడుతున్నాయి. నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు నల్లగొండ పరిసర గ్రామాలు, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగలపల్లి, ఎల్లారెడ్డిగూడెం, చేరువుగట్టు గ్రామాలను కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) గా మారుస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు పట్టణ అభివృద్ధి ప్రణాళికలపైన ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ లో స్థానిక జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మరియు పురపాలక శాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో NUDA జీవోను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డికి అందజేశారు.
నల్లగొండ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయండి : మంత్రి కేటీఆర్
అంతే గాకుండా నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో విడుదల చేసిన 84 కోట్ల నిధుల జీవోలను మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి అందజేశారు. అనంతరం సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా కేంద్రం సమగ్ర అభివృద్ధి కోసం వేగంగా ముందుకు కదలాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పట్టణం సమగ్ర రూపు రేఖలు మార్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందని ఇచ్చిన హామీ మేరకు పట్టణాన్ని సమగ్రంగా మార్చే ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని, ముఖ్యంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు అవసరమైన కనీస పౌర వసతుల కల్పనతో పాటు దీర్ఘకాలికంగా పట్టణ భవిష్యత్ అవసరాలకు తగినవిధంగా మౌలిక వసతుల కల్పనపైన కూడా దృష్టి సారించాలని అధికారులను కోరారు.
ఈ సమావేశం సందర్భంగా పురపాలక శాఖ ఉన్నతాధికారులు నల్గొండ పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరాలు అందజేశారు. రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్ నిర్వహణ, గ్రీనరీ పార్కుల అభివృద్ధి, ఉదయ సముద్రం సుందరీకరణ వంటి కార్యక్రమాలపైన చర్చించారు. పట్టణానికి సంబంధించి వాటర్, ఆడిట్ పవర్ ఆడిట్ ని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి స్వల్పకాలిక లక్షలతో పాటు రానున్న ఏడాది లోపల చేపట్టబోయే వివిధ కార్యక్రమాల జాబితాను అందజేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పట్టణ అభివృద్ధిపైన నిరంతరం సమీక్ష సమావేశాలు ఉంటాయని, ఈ మేరకు ఎప్పటికప్పుడు అధికారులు పట్టణ పురోగతిని తెలియజేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా స్థానికంగా ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉంటే ఇందులో జతపరచాలని సూచించారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తరచుగా జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొనే అధికారులు ప్రజలు ఆమోదం తెలిపే విదంగా నివేదికలు రూపొందించాలన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ