దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళనలలో రైల్వే బలగాల కాల్పుల్లో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అభ్యర్థి దామెర రాకేశ్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్ పేటకు చేరిన రాకేష్ నిన్నటి దుర్ఘటనలో అసువులు బాసిన విషయం తెలిసిందే. ఆర్మీ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లిన రాకేష్ విగతజీవిగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా రాకేశ్ మృతిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అతని కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు వారి కుటుంబలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం దబీర్ పేటకు చేరుకున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు రాకేష్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాకేశ్ పాడెను మోసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే రాకేశ్ అంతిమయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. వరంగల్ ఎంజీఎం నుంచి ర్యాలీగా ప్రారంభమైన రాకేశ్ అంతిమయాత్ర ధర్మారం, నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయం, పాకాల సెంటర్ మీదుగా ఖానాపూర్ మండలం దబీర్పేట వరకు కొనసాగింది.
అయితే ర్యాలీ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోచంమైదాన్ కూడలి వద్ద కొందరు యువకులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై దాడికి యత్నించారు. రాళ్లతో దాడి చేయడంతో భవనం అద్దాలు పగిలిపోయాయి. అలాగే కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైకుంఠ ధామం వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్క చేరుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఇరువర్గాలకు సర్దిచెప్పి కార్యక్రమం కొనసాగేలా చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల అశ్రునయనాల మధ్య రాకేశ్ మృతదేహానికి తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ