గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఆదివారంతో ప్రచార గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో నాంపల్లిలో గల రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నాయి. ఆదివారం ఉదయం 10:30 గంటలకు అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. ముందుగా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని అమిత్ షా సందర్శించనున్నారు. అనంతరం బీజేపీ అభ్యర్థుల తరపున రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. 3 గంటలనుంచి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశముంది. ఇక బీజేపీ ఆఫీస్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి, ఎయిర్ పోర్ట్ కు చేరుకొని ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. ఇక అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు బీజేపీ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ ఇంచార్జ్ గా వ్యవహరించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ