తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల వేతనాలపై నవంబర్ 27, బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని చెప్పారు. ఒక్కరోజు గైర్హాజరైనా 8 రోజుల వేతనం మినహాయించే అధికారం ఉంటుందని, కానీ కార్మికులు 52 రోజులపాటు సమ్మెలోనే ఉన్నారని, ఈ నేపథ్యంలో కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించలేమని హైకోర్టుకు వివరించారు. మరో వైపు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పనిచేసిన సెప్టెంబర్ నెలకు వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. జీతాలు అందక రాష్ట్రంలో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, తక్షణమే సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. అయితే వేతనాల చెల్లింపుపై కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, హైకోర్టు కాదని అదనపు అడ్వొకేట్ జనరల్ సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 4, బుధవారం నాటికీ వాయిదా వేసింది.
[subscribe]