హైదరాబాద్ నగరంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీ నగర్ లోని కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి గుండె తరలింపు కోసం మెట్రో రైలును ఉపయోగించారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు మొత్తం 21 కిలోమీటర్ల దూరాన్ని మెట్రో రైలు 30 నిమిషాల్లో చేరుకుంది. శస్త్ర చికిత్స నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడంలో భాగంగా గ్రీన్ఛానల్ ద్వారా ఈ గుండె తరలింపు ప్రక్రియను మంగళవారం నాడు చేపట్టారు.
ముందుగా నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల నర్సిరెడ్డి అనే రైతు బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. సంప్రదింపుల అనంతరం గుండెను తరలించి అపోలో ఆసుపత్రిలో ఓ వ్యక్తికీ శస్త్రచికిత్స ద్వారా అమర్చేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మెట్రో రైల్ ద్వారా గుండె తరలింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు రోడ్డుమార్గంలో, నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు మెట్రో రైలులో, అనంతరం జూబ్లీహిల్స్ చెక్పోస్టు మెట్రో స్టేషన్ నుంచి అపోలో ఆస్పత్రి వరకు మళ్లీ రోడ్డుమార్గంలో గుండెను తరలించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ గోఖలే నేతృత్వంలో గుండె శస్త్రచికిత్స జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ