ఎన్నికలంటేనే అసమ్మతి, అసంతృప్తి, తిరుగుబాట్లు వంటి ఎలాంటి పార్టీకయినా తప్పవు. ముఖ్యంగా టికెట్లు ఆశించి భంగపడిన వారు.. వేరే పార్టీలలోకి వెళ్లి సీట్లు తెచ్చుకోవడమో,రెబల్స్గా మారి సొంతపార్టీకి తలనొప్పులు తేవడం వెరీ కామన్. ఈ ఎన్నికల్లో కూడా మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అన్ని జిల్లాల్లో కూడా ఈ రెబల్స్ బెడద తప్పలేదు.
అధికార బీఆర్ఎస్లో సీటు రాని నాయకులంతా.. కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లగా.. అక్కడ కొందరికి సీట్లు, కొందరికి హామీలు లభించాయి.అలాగే కాంగ్రెస్లో సీట్లు దక్కనివారు బీజేపీ, బీఆర్ఎస్లోకి జంపయిపోయారు. కొత్తగా వచ్చినవారికి గులాబీ పార్టీ టికెట్లు ఇవ్వలేదు కానీ హామీలు మాత్రం గట్టిగానే ఇచ్చింది. బీజేపీ మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కోరినట్లు టికెట్లు, హామీలు కూడా ఇచ్చింది. చివరకు ఓ వైపు నామినేషన్లు కొనసాగుతుండగా చివరి రోజు వరకూ కూడా మూడు పార్టీల నుంచి జంపింగ్లు కొనసాగాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేయడం కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ శాతం జరగడంతో అక్కడ అసంతృప్తులు ఎక్కువ అయ్యారు.
బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి సొంతనేతలను కాదని మరీ కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు కేటాయించింది. గాంధీభవన్కు కొత్తగా వచ్చిన వారిలో..అలా 12 మందికి పైగా నేతలకు టికెట్లు లభించాయి. దీంతో అప్పటివరకు కాంగ్రెస్ పార్టీని నమ్మి.. పార్టీ కోసం పనిచేసిన నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో 24 స్థానాల్లో రెబల్స్ స్వతంత్రులుగానో…బీఎస్పీ లేదా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల తరపునో బరిలోకి దిగి హస్తం పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చారు.
అందుకే అటువంటివారిని తిరిగి తమ దారికి తెచ్చుకోవడానికి మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ కాస్త ఎక్కవగానే కష్టపడింది. నామినేషన్లు ఉపసంహరణ సమయంలో తిరుగుబాటుదారులకు రకరకాల తాయిలాలు, హామీలు ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ 20 మందిని బరిలో నుంచి తప్పుకునేలా చేసింది. ఇంకా నాలుగు స్థానాల్లో రెబల్స్ పోటీలోనే ఉండగా… ఒక్క ఆదిలాబాద్ తప్ప మిగిలిన చోట్ల రెబల్స్ వల్ల పెద్ద ఇబ్బందేమీ ఉండదని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు.
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన పటేల్ రమేష్రెడ్డికి.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మద్దతిచ్చినా కూడా ఆయన పలుకుబడి ఉపయోగపడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీనియర్ నేతల ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి వైపే మొగ్గు చూపింది. చివరకు రేవంత్రెడ్డి కూడా చేతులెత్తేయడంతో.. పటేల్ రమేష్రెడ్డి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టికెట్ మీద సూర్యాపేటలో నామినేషన్ దాఖలు చేశారు.
రమేష్రెడ్డి ఇప్పుడు బరిలో ఉండటం కాంగ్రెస్ అభ్యర్థి దామోదరరెడ్డికి తీవ్రంగా నష్టం కలిగించే అంశమే. దీంతో పార్టీ నాయకులు ఫోన్ చేసి బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరకు ఏఐసీసీ ప్రతినిధిగా రోహిత్ చౌదరి, పీసీసీ ప్రతినిధిగా మల్లు రవి ఆయన నివాసానికి వెళ్లి ఒప్పిస్తే అప్పుడు పోటీనుంచి తప్పుకున్నారు. చివరకు పటేల్కు నల్లగొండ ఎంపీ సీటు ఇస్తామనే హామీతో.. నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్లో కొందరు పార్టీకి దూరం అవడం, మరి కొందరు స్వతంత్రులుగా ఎన్నికల బరిలోకి దిగడంతో మొత్తం 16 జిల్లాలలో పార్టీ అధ్యక్షుల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడిన మరికొంతమంది నేతలు మాత్రం డీసీసీ చీఫ్ పోస్టులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారు కోరినట్లుగానే ఈ పదవులు ఇవ్వడానికి పార్టీ నాయకత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది.
రెబల్స్గా పోటీలో ఉన్నవారికి ప్రస్తుతం డీసీసీ పదవులు, అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చి దారిలోకి తెచ్చుకున్నట్లు సమాచారం.అయినా కూడా చాలామంది సొంత పార్టీపై గుస్సాగానే ఉన్నారని.. తమను కాదని టికెట్లు ఇచ్చిన వారికి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE