తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రూ.2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటయింది అని చంద్రబాబు చెప్పడం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి ఒక వీడియో విడుదల చేశారు.
చారిత్రక వాస్తవాల మీద అవగాహనా ఉండి, దాన్ని విశ్లేషించుకుంటూ ఎవరైనా మాట్లాడితే సమాజం హర్షిస్తుంది గానీ, చరిత్ర తెలియకుండా ఇదే నిజమని మాట్లాడమంతా దారుణమైన విషయం ఇంకోటి ఉండదన్నారు. ‘జొన్నకలి, జొన్నయంబలి…జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్…సన్నన్నము సున్న సుమీ…పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్’ అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారన్నారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు ప్రసిద్ధి చెందిందన్నారు.
“ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ. అప్పట్లోనే విష్ణు కుండినుల నుండి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల దాక గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయవృద్దికి బాటలు వేశారు. 15వ శతాబ్దం నుండి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ది. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించారు. అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది. 1956లో ఆంధ్రలో తెలంగాణ విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం. చెరువులు, కుంటలను ధ్వంసం చేశారు. అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారు. అప్పుడు కట్టిన ఒక్క ప్రాజెక్టు మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు నిర్ణీత లక్ష్యానికి సాగునీరు అందించిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగునీరు ఇస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారు. గ్రామాల్లో ఉపాధి కరువై బొంబాయి, దుబాయి బాట పట్టేలా చేశారు. ఆఖరుకు రూ.2కు కిలో బియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారు. వెయ్యేళ్ళకి పైగా వరి పండించిన చరిత్ర తెలంగాణది. తెలంగాణ జాతికి చంద్రబాబు తక్షణం క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE