ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా ఓ లెక్క.. ఆ ఏడు నియోజకవర్గాల్లో ఓ లెక్క. అక్కడ ఎప్పుడూ ఒక పార్టీదే గుత్తాధిపత్యం. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు తథ్యం. ఈసారి పరిస్థితిలో మార్చు స్పష్టంగా కనిపిస్తోంది. ఏడు స్థానంలో ఆరు మాత్రమే అన్నట్లుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఎంఐఎం ఖాతా నుంచి ఓ స్థానం చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం.
కీలక ప్రాంతాలు ఉన్న ప్రాంతం నాంపల్లి . తెలంగాణ అసెంబ్లీ కూడా అక్కడే ఉంది. అదే విధంగా గన్ పార్క్, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి రైల్వే స్టేషన్ లాంటి చారిత్రక కట్టడాలు ఉన్న ఈ నియోజకవర్గ ప్రజల జీవన విధానం అత్యంత దయనీయంగా ఉంది. ఏ చిన్న పాటి వర్షం కురిసిన ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మల్లేపల్లి, అఫ్జల్ సాగర్, కోమటికుంట, ఆగాపురా ప్రాంతాల్లోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. వర్షాలకు ఇళ్లు కూలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఇప్పటి వరకూ అక్కడ అధికారం అనుభవించిన ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎంఐఎం నుంచి 2009లో విరాసత్ రసూల్ ఖాన్, 2014, 2018లో మేరాజ్ హుస్సేన్లు విజయం సాధించారు. అక్కడ అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడ ఈసారి గాలి ఎంఐంఎకు వ్యతిరేకంగా వీస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో 60 శాతానికిపైగా ముస్లిం జనాభా ప్రతిసారి పతంగి పార్టీకి జై కొడుతున్నారు. అయితే, ఈసారి కొన్నిస్థానాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఈసారి నాంపల్లి లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ పదవిలో ఉన్నా.. లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు. దీనికి తోడు గతంలో మూడు సార్లు ఆయన విజయం దగ్గరకు వెళ్లి వచ్చారు. దీంతో ప్రజలకు ఆయనపై సానుభూతి ఉంది. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నాంపల్లిలో ఈ సారి ఆ పార్టీ అభ్యర్థికి మహ్మద్ ఫిరోజ్ఖాన్ గట్టి పోటీ ఇస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఏర్పాటైన నాంపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడానికి ఎంఐఎంకు చెమటోడ్చాల్సి వచ్చింది. అప్పట్లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ కేవలం 6,799 ఓట్ల మెజారిటీతో నాడు ప్రజారాజ్యం పార్టీ తరఫున నిలబడిన ఫిరోజ్ఖాన్పై విజయం సాధించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఫిరోజ్ ఖాన్పై ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 17,296 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 2018లో ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ఖాన్ గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ మేరాజ్ 9,675 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలవగలిగారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బరిలోకి దిగిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్.. ఫిరోజ్ ఖాన్ కు పోటీ ఇవ్వలేరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రచారంలో ఊపు మీదున్న కాంగ్రెస్ కు గత ఎన్నికలకంటే బలం పెరిగింది. ఆ పార్టీ గాలి వీస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో నాంపల్లిలో కాంగ్రెస్ పాగా వేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి కచ్చితంగా ఫిరోజ్ ఖాన్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE