తెలంగాణలో టీడీపీ ఓటర్లకు పెరుగుతోన్న డిమాండ్

Where are the voters of TTDP, TDP voters in Telangana,TDP voters,,BRS,BJP,Congress, polling booth
Where are the voters of TTDP, TDP voters in Telangana,TDP voters,,BRS,BJP,Congress, polling booth

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారపార్టీ అయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కూడా గెలిచి జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని అనుకుంటోంది. అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తెలంగాణలో తాము గెలిస్తే ఈ ఉత్సాహం కేంద్ర ఎన్నికలపైన కూడా పడుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచి అధికారంలో చక్రం తిప్పాలని చూస్తోంది. ఇలా ఎవరికి వారే తమ తమ లెక్కలు వేసుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే తెలంగాణాలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు ఇప్పుడు టీడీపీ వరప్రదాయనిలా కనిపిస్తోంది. ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు తాము దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ కేడర్‌కు బీజేపీకి, జనసేనకు మద్దతు ఇవ్వమని కోరిన సంగతి తెలిసిందే. అయితే జనసేన పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాలలో జనసేనకు ఓటేయాలని డిసైడ్ చేసుకున్న టీడీపీ వర్గాలు.. మిగిలిన స్థానాల్లో బీజేపీకి ఓటేయడానికి అంతగా మొగ్గు చూపించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు టీడీపీ ఓట్లని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.  టీడీపీకి ఎంత లేదు అనుకున్నా తెలంగాణలో క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల ఇప్పటికీ  బలంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ వంటి ఆంధ్రా ప్రభావిత ప్రాంతాల్లో ఆ పార్టీకి నేటికీ బలమైన క్యాడరే ఉంది.

మొత్తంగా  టీడీపీ ఓటర్లు తెలంగాణ వ్యాప్తంగా  ఓ 20 స్థానాలలో ప్రభావం చూపుతారని ఆ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా టీడీపీ జపం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఆయన అరెస్టుతో ఇక్కడ ఏం పని అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకు గౌరవమేనని.. అరెస్టుపై తన మాటలను వక్రీకరించారని దిద్దుబాటు చర్యలకు దిగడం దీనిలో భాగమే.

టీడీపీ మాజీ నేతలైన తుమ్మల నాగేశ్వరరావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు ఇప్పటికీ  టీడీపీని నెత్తిన పెట్టుకునే నేతలే. తుమ్మల నాగేశ్వరరావు  ఏకంగా టీడీపీ జెండాను పట్టుకుని మరీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తమకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయే నంటూ గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఆయన అరెస్టు‌ను కూడా  ఖండించారు. దీంతో వీరిని కాకా పట్టుకుని వీరి వర్గీయుల నుంచి టీడీపీ ఓట్లు తమకు పడేలా వారివారి పార్టీల  నేతలు ప్రయత్నాలు షురూ చేశారు. మరికొందరు టీడీపీ సపోర్టులు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచుతున్నారు.  మరి టీటీడీపీ ఓటర్లు ఎటువైపు అంటూ తెలంగాణ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =