హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదలు వలన తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు సాయంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు బాధితులను ఆదుకునేందుకు పెద్దఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఒకవైపు కరోనా పట్టిపీడిస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడతెరపని వర్షాలు, వరదలు తోడయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడని వర్షపాతం దేశం మొత్తం చూసింది. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణలో దీని తాకిడి మరింత ఎక్కువగా ఉంది. గత వారం రోజులుగా చాలామంది జీవన విధానం చిన్నాభిన్నం అయింది. హైదరాబాదులో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఆస్తి నష్టం జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం ఒక కారణం. కానీ పరిస్థితులు ఏవైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజలు పడుతున్న కష్టాలు చూసి, ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా వంతుగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను. అలాగే జనసైనికులకు, ప్రతి అభిమానులకు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో వారి వంతుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం ఇది” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu