తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని చేపట్టిన కార్యాచరణలో భాగంగా వరంగల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వరంగల్ లోని మడికొండ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన సైయెంట్, టెక్ మహీంద్రా ఐటీ ప్రాంగణాలను జనవరి 7, మంగళవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో ఐదు ఎకారాల్లో కొత్తగా నిర్మించిన సైయెంట్ కంపెనీ నూతన భవనంలో 600 నుంచి 700 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంది. అలాగే టెక్ మహీంద్రా ఏర్పాటు చేసిన క్యాంపస్ లో కూడా దాదాపు 100 నుంచి 150 మంది ఉద్యోగులు విధులు నిర్వహించబోతున్నారు. ఈ ఐటీ కంపెనీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
2016, ఫిబ్రవరిలో మొదటిసారిగా వరంగల్ ఐటీ సెజ్ లో టీఎస్ఐఐసీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత అక్కడ సైయంట్ కంపెనీతో పాటుగా మరో రెండు కంపెనీలు తన కార్యకలాపాలను ప్రారంభించాయి. ఐటీ కార్యకలాపాలకోసం మొత్తం 27 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఐటీ హబ్గా వరంగల్ను తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ గతంలోనే ప్రకటించారు. ఆ దిశగానే వరంగల్ లో పలు ప్రధాన ఐటీ కంపెనీలు కార్యకలాపాలను నిర్వహించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
[subscribe]