జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులైన కొంగర సైదులు, కడియం శ్రీనివాసరావు కుటుంబాలను పరామర్శించి, రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ముందుగా శుక్రవారం ఉదయం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు గ్రేటర్ హైదరాబాద్ జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మెట్టుగూడ, ఉప్పల్, నాగోలు, ఎల్బీనగర్ సర్కిల్స్ లో గజమాలలతో సత్కరించాయి. మెట్టుగూడలో ఆడపడుచులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాలతో అపూర్వ స్వాగతం పలికాయి.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం:
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతమంటే తనకెంతో ఇష్టమని, ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆడపడుచులు స్వాగతం పలకడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన పార్టీ ఉంటుందని, భవిష్యత్తులో జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన యువత, ఆడపడుచులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో చర్చించుకొని, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి సత్తా చాటుతామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని స్థానాల్లో పోటీ చేద్దామని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన సత్తా చూపిద్దాం:
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల తన మాటను మన్నించి ఇక్కడి నేతలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బలాబలాలు పరిశీలించుకొని అన్ని ప్రాంతాల్లో పోటీ చేద్దాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేసి జనసేన సత్తా చూపిద్దాం. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 17వేల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కొందరికి వయో పరిమితి సడలింపు ఇబ్బందులు ఉన్నాయని ఆడపడుచులు నా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కచ్చితంగా మాట్లాడతాను. ఎస్టీలకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్లు రావాల్సి ఉందని, దానిపై కూడా మాట్లాడతాను” అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి వేమూరి శంకర్ గౌడ్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి రామ్ తాళ్లూరి, తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, వీర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నూరి శిరీషతో పాటు గ్రేటర్ హైదరాబాద్ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF