దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ‘దిశ’ ఎన్కౌంటర్ బూటకం అని సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. 2019 డిసెంబర్ నెలలో రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లిలో జరిగిన దిశా అత్యాచార, హత్య ఘటనలో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన కేసుకు సంబంధించి శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిర్పూర్కర్ కమిటీ దీనిపై తన పూర్తి నివేదికను కోర్టుకి అందజేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ సారథ్యంలో.. బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డి.ఆర్. కార్తికేయన్లు సభ్యులుగా ఉన్న కమిషన్ దర్యాప్తు చేసింది.
ఈ కమిషన్ 387 పేజీల నివేదికను శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆ నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండగానే పారిపోయేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు నిందితులపై కాల్పులు జరపడం అబద్దమని, పోలీసులు ఇది కావాలని చేసిన ఎన్కౌంటర్ అని నివేదికలో స్పష్టం చేశారు. అనుమానితులు పోలీసులపై దాడికి దిగారని, వారి దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స చేశారని పోలీసులు చెబుతున్నదంతా అవాస్తవమని మేం గుర్తించాం అని నివేదికలో తెలిపారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని ప్యానెల్ నిర్ధారించిన తర్వాత సుప్రీం కోర్ట్ దిశ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో విచారణ సరైన దిశగా సాగలేదని, ప్రత్యేక బృందంతో విచారణ నిర్వహించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను హై కోర్టుకు పంపాలని, అలాగే ఇరుపక్షాల పిటిషన్ దారులకు దీనిని అందజేయాలని చెప్పింది. ఇంకా ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసు అధికారులు.. సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఈ నేరానికి పాల్పడ్డారని, వీరిపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, సెక్షన్ 201 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
హైదరాబాద్ కు చెందిన ఒక వెటర్నరీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. దీంతో ప్రజలలో నెలకొన్న ఆగ్రహావేశాలను గమనించిన పోలీసుశాఖ నిందితులను అరెస్ట్ చేయడం, సాక్షాల సేకరణ నిమిత్తం ఘటనాస్థలికి తీసుకెళ్లడం, అక్కడ నిందితులు ఎన్కౌంటర్ చేయబడటం వరుసగా జరిగిపోయాయి. అయితే ఈ ఎన్కౌంటర్ విషయంలో పోలీసులకు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభించగా.. ఇప్పుడు ఇదే కేసులో వారిపై కోర్ట్ విచారణ చేయనుండటం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ