ముంబయిలోని ఆరే కాలనీలో చెట్లను నరికివేయడాన్ని ఆపాలని అక్టోబర్ 7, సోమవారం నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరిగా అక్టోబర్ 21న విచారిస్తామని, అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చెట్ల నరికివేతపై ఆందోళన చేపట్టిన స్థానికులుకు, పర్యావరణ ఆందోళన కారులకు ఊరట లభించింది. ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కార్ షెడ్డు కోసం ముంబైలోని ఆరే కాలనీలో 2,000కి పైగా చెట్లు నరికివేత చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, వీటి తొలగింపునకు ట్రీ అథారిటీ సైతం ఆమోదం తెలిపింది. దీంతో అక్కడి స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. చెట్ల నరికివేత నిలిపేయాలని బోంబే హైకోర్టును ఆశ్రయించినా ఎటువంటి ఫలితం దక్కలేదు.
ఈ అక్టోబర్ 4 శుక్రవారం నాడు రాత్రి పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేసి, అక్కడి పరిసరాల వద్ద 144 సెక్షన్ విధించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించినా ప్రకాశ్ అంబేద్కర్ తో పాటు 30 మందికి పైగా మంది ఆందోళనకారులను అరెస్ట్ చేయగా, వారికీ వివిధ షరతులతో బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేత ఆపాలని నోయిడా న్యాయ శాస్త్ర విద్యార్థి రిషవ్ రంజన్ ఆదివారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కు లేఖ రాయగా, కోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్ల నేతృత్వంలో ఏర్పాటైన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టి ఆరే కాలనీలో చెట్లను నరికివేయడాన్ని ఆపాలని సంచలన తీర్పు ఇచ్చింది. అరెస్ట్ అయిన ఆందోళనకారులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]