హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సాధారణంగా మూడో రోజు నుంచి మొదలుపెట్టి, ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజు, నిమజ్జనాలు కొనసాగించి, పదకొండో రోజున పెద్దస్థాయిలో నిమజ్జన కార్యక్రమాలు చేపట్టి నగరవాసులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా ముగిస్తారు. హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంవత్సరం కూడ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కార్యక్రమాన్నే ముందుగా చేపడుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యే వరకు ఇతర విగ్రహాలను ఎక్కడికక్కడ ఆపి వేయనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ ను చేరుతుందని చెప్పారు. ఒంటి గంట లోపల ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా సెప్టెంబర్ 12వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజ్ లకు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
45 టన్నులకు పైగా బరువున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమానికి పోలీసు శాఖ ఇప్పటికే పలు సూచనలు చేసి, ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్న విధంగానే ఎన్టీఆర్ మార్గ్ లోనే ఈసారి కూడ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. గురువారం జరిగే నిమజ్జన కార్యక్రమానికి ఇప్పటికే సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేసారు. క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ మహాగణపతిని హుస్సేన్ సాగర్లో సంపూర్ణంగా నిమజ్జనం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. నిమజ్జన సందర్భంగా 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు వరకు జంట నగరాల పరిధిలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. మరో వైపు ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగేందుకు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్ పలు సూచనలు చేసారు. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లను ఏర్పాటు చేశామని, అవి 13వ తేదీ ఉదయం 6 గంటలవరకు కొనసాగుతాయని చెప్పారు. పతే నగర్, సైబర్ టవర్స్, ఫోరమ్ మాల్, గచ్చిబౌలి ఫ్లైఓవర్లు పైకి గణేష్ విగ్రహాలు అనుమతించబోమని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=dkoihhEE0zA]