తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున జాతరకు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా పలువురు ప్రముఖులు జాతరకు విచ్చేసి వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలకు భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీల లెక్కింపు ఫిబ్రవరి 12, బుధవారం నాడు ప్రారంభమైంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో ఈ హుండీలను భద్రపరిచారు. జాతరలో మొత్తం 494 హుండీలను ఏర్పాటు చేశారు. ఈ హుండీలను 200 మంది సిబ్బంది లెక్కిస్తున్నారు. హుండీల లెక్కింపు పక్రియను దేవాదాయ శాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, మేడారం ఆలయ ఈవో రాజేంద్ర పర్యవేక్షణలో చేపడుతున్నారు. లెక్కింపు ప్రాంగణంలో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. హుండీల లెక్కింపు సుమారు వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. గత ఏడాది జాతర సందర్భంగా మేడారం ఆదాయం రూ.10కోట్లు రాగా, ఈసారి రూ.10కోట్లు కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
[subscribe]