ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించమని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకంలో మార్పుల వలన రైతులపై ఒక్కపైసా భారం కూడా పడదని సీఎం హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:
- రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం.
- ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులపై నిషేధం. ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గేమ్స్ పై నిషేధం. ఆన్లైన్ లో జూదం పట్టుబడితే 6 నెలలు శిక్ష, అలాగే వాటి నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, రెండోసారి కూడా పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా నిర్ణయం.
- రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు మరియు ఎత్తిపోతల పథకాల నిర్మాణం, సంబంధించిన పనులకు పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం.
- డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్టులు ఏర్పాటుకు ఆమోదం.
- ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు జీవోకు ఆమోదం.
రూ.2565 కోట్లతో ప్రకాశం బ్యారేజ్కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం. - పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసే ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఏపీ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020 కు కేబినెట్ ఆమోదం.
- ప్రకాశం బ్యారేజీకి దిగువున మరో రెండు బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం.
- బాబు జగజ్జీవన్రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–2 నిర్మాణ ప్రతిపాదలకు ఆమోదం.
- గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు భూమి కేటాయింపుకు ఆమోదం.
- మావోయిస్టు పార్టీ, అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగింపు.