రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ-కామర్స్ సంస్థ ప్లాంట్ లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం హైదరాబాద్ బేగంపేట హారిత ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్స్ కంపెనీ ఎండీ జాన్ నేచుపాదం పరస్పరం “ఎండుమిర్చి” మార్కెటింగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రైతులు పండించిన పంట తీసుకోవడానికి కంపెనీలు ముందుకు వస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. మిర్చికి ప్రోత్సాహం లేదని నిరుత్సాహం పడరాదని కంపెనీలు ఆసక్తి చూపుతున్నారని ఆయన మహిళా సంఘాలకు సూచించారు.
మిర్చి వ్యాపారం విషయంలో ఈ ఏడాది రూ.200కోట్ల వ్యాపార లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి అన్నారు. గతంలో విద్యుత్, నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడేవారని, ఈ కారణంగా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపలేదని అన్నారు. నేడు తెలంగాణ సాధించుకున్నాక ఎనిమిదేళ్లలో ఆ రోజులన్నీ పోయి 365 రోజులు చెరువులు దండీగా నీటితో నిండి ఉండటం, కరెంటు 24 గంటల సరఫరాతో పంటలు విపరీతంగా పండటంతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ కారణంగా పంటల కొనుగోలు–మార్కెటింగ్ కు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వము స్వయం సహాయక సంఘాలకు 15 వేల కోట్లకు పైగా రుణాలు ఇవ్వడంతో పాటు అడిగిన పనులన్నీ అమలు చేస్తూ మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం పాటు పడుతున్న కంపెనీలను ఆయన అభినందిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ-కామర్స్ మార్కెటింగ్ సౌకర్యం విస్తరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెర్ప్ సీఈఓ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోందన్నారు. పెద్దపెద్ద వ్యాపార రంగాలలో మహిళలు రాణిస్తూ రాష్ట్ర రైతు ఉత్పాదక సంఘాల ద్వారా వ్యాపారం నిర్వహించడంలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది అన్నారు. ఈ కారణంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ ఎఫ్పీఓలుగా గుర్తించబడి రాష్ట్ర అవార్డు సాధించిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాల ద్వారా మహిళల ఆదాయ మార్గాలు పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రెండు నెలల్లోనే ఎండుమిర్చి విషయంలో ఖమ్మం జిల్లాలో 40 కోట్లతో వ్యాపారం నిర్వహించి, 92 లక్షల లాభాలు గడించడం అభినందనీయమన్నారు. వచ్చే సీజన్ నుండి ఆరు జిల్లాలలో వ్యాపారం నిర్వహించి 20 వేల మెట్రిక్ టన్నుల ఎండిమిర్చి సేకరించి పది కోట్ల లాభాలు ఆర్జించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ప్లాంట్ లిపిడ్స్ కంపెనీ ఎండీ జాన్ నేచుపాదం మాట్లాడుతూ, కమ్యూనిటీ భాగస్వామ్యంతో మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పాటు సమాచార వ్యవస్థ అందరికీ చేరువైనందున అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. 15 వేల ఎకరాల విస్తీర్ణంలో తమ కంపెనీ ద్వారా తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాలలో ఎండుమిర్చి వ్యాపార రంగంలో ముందంజలో ఉన్నట్లు తెలిపారు. సాగు పద్ధతులు, గ్రేడింగ్ తదితర విషయాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. కంపెనీ చీఫ్ ప్రోక్యుర్ మెంట్ అధికారి థామస్ డానియల్ మాట్లాడుతూ, క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించి నాణ్యతతో కూడిన ఉత్పత్తికి సంఘాలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. మహిళా సంఘాలకు నైపుణ్యం పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ముఖ్య ఆపరేషనల్ అధికారి రజిత, పలు విభాగాల డైరెక్టర్లు సునీత, సువిధ, పద్మ, ప్లాంట్ లిపిడ్స్ కంపెనీకి చెందిన ప్రతినిధులు, డి.ఆర్.డి.వోలు, అదనపు డి.ఆర్.డి.వోలు, డి.పి.ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY