వ్యవసాయం అనేది రోటీన్ ప్రక్రియ కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మారాలని రైతులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శనివారం నాడు నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట జిల్లా, ములుగు మండలం, క్షీరసాగర్ గ్రామంలో పర్యటించారు. క్షీరసాగర్ గ్రామంలో ఇప్పటికే రూ.6.62 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టగా, ఈ రోజు మరో 1.06 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాక ముందు పల్లెలు ఏలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పల్లెలు ఏలా మారాయి..? 70 ఏళ్లలో జరగని పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలో 7 ఏళ్లలో జరిపి చూపారని మంత్రి మంత్రి హరీశ్ రావు అన్నారు.
అలాగే క్షీరసాగర్ గ్రామ పరిధిలో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుకు మంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. క్షీరసాగర్ లో ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రి హరీశ్ నాటారు. అనంతరం ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం, వరి సాగులో వెదజల్లే పధ్ధతిపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, హార్టి కల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం:
“ఆయిల్ ఫామ్ తోటల పెంపకం సముద్రతీర ప్రాంతాలకే అనుకూలంగా ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో గాలిలో తేమ శాతంతో ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు తెలంగాణ రాష్ట్రంలో 26 జిల్లాలు అనుకూలంగా మారాయి. ఆయిల్ ఫామ్ లాభసాటి పంట. 60 వేల కోట్ల పామాయిల్ ఇతర దేశాల నుంచి కొనుగోలు ద్వారా దిగుమతి చేసి మన దేశంలో వాడుకుంటున్నామని, మనకు మనమే పామాయిల్ తోటలు పెడితే ఎగుమతి చేసేలా ఎదుగుతాం. పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. పామాయిల్ సాగుకు అవసరమైన వనరులన్నీ సబ్సిడీ రూపంలో పెట్టుబడిగా ప్రభుత్వమే సాయం చేస్తుంది. పామాయిల్ సాగు డ్రిప్ కై హెక్టారుకు 43 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రైతు కేవలం రూ.4300 రైతు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 39 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్క ఎకరానికి 1 లక్షా 20 వేల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సిద్ధిపేట జిల్లా రైతులను ఆయిల్ ఫామ్ సాగులో ముందుకు తీసుకుపోవాలన్నదే నా కోరిక. పామాయిల్ కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉంది. అందరూ రైతులకు గిట్టుబాటు ధర అందించేలా, అన్నీ రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు ముందుకు రావాలి” అని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ