ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 8, బుధవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సేవలు అందించేలా ప్రైవేట్ ఆస్పత్రులు సైతం సిద్ధం కావాలని కొన్ని రోజుల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 5, నెల్లూరులో 5, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, విజయనగరంలో 5, ప్రకాశంలో 4, అనంతపురంలో 4, గుంటూరులో 4, శ్రీకాకుళంలో 4, కడపలో 3, పశ్చిమగోదావరిలోని 3 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ 58 ప్రైవేటు ఆస్పత్రుల యొక్క సేవలను కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో మొత్తం 19,114 బెడ్లు, 1286 ఐసీయూ బెడ్లను రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. అలాగే 717 ఐసోలేషన్ బెడ్లను కూడా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే జాతీయ విపత్తుల నివారణ చట్టం మరియు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రైవేట్ పరిధిలోని వైద్య కళాశాలలు, నర్సింగ్ హోంలు, ట్రస్ట్ల పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు.