తెలంగాణ రాష్ట్రంలో జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు కొత్త రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులుకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 90.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్నామని, ఇలా దేశంలో 90.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. 87 లక్షల 41 వేల మందికి రేషన్ కార్డులు గతంలో అందజేయగా, కొత్తగా 3 లక్షల 9 వేల 83 మందికి రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు.
ఓట్ల కోసం కాకుండా, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం:
ప్రస్తుతం కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు కాగా, లబ్ధిదారులు 2 కోట్ల 88 లక్షల మంది ఉన్నారన్నారు. రేషన్ పై ప్రతి ఏటా ప్రభుత్వం రూ.2766 కోట్లు, ప్రతి నెలా రూ.232 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. 70 ఏళ్లలో వేరే ప్రభుత్వాలు చేయని పనిని 7 ఏళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ సహా ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఓట్ల కోసం కాకుండా, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు గజ్వేల్ నియోజవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీ సహా 6 మండలాలు చెందిన 1543 మంది లబ్దిదారులకు రేషన్ కార్డులు, 452 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ