హైదరాబాద్ లోని నార్సింగిలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ. 5 లకే భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి పనిచేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో నార్సింగిలో అత్యున్నత సెంట్రలైజెడ్ కిచెన్ను ఏర్పాటు చేయగా మంత్రి ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గత నెలలో నగరంలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ. 5 కు నాణ్యమైన భోజనం అందించే కార్యక్రమాన్ని ఉస్మానియా ఆస్పత్రి వద్ద మొదలుపెట్టామని గుర్తు చేశారు. నగరానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారని, వారి వెంట ఒకరిద్దరు కుటుంబ సభ్యులు కూడా వస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి ఏవైనా సర్జరీలు జరగడం కానీ, దీర్ఘకాలిక చికిత్సలు కానీ తీసుకునే క్రమంలో రోగుల సహాయకులు రోజుల తరబడి ఆస్పత్రి వద్దే ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయని అన్నారు.
ఇలాంటప్పుడు వారికి భోజన సదుపాయాలు సరిగా ఉండక అవస్థలు పడుతుంటారని, అలాంటి వారికోసమే ప్రభుత్వం, హరే కృష్ణతో కీలక ఒప్పందం చేసుకుందని మంత్రి హరీష్ వెల్లడించారు. దీనిద్వారా రోజుకి సుమారు 20 వేల మందికి రూ. 5 లకే భోజనం అందుతోందని, దీనికోసం ప్రభుత్వం ఒక్కో ప్లేటుకి రూ. 21 రాయితీ ఇస్తోందని తెలియజేశారు. ఈ పథకం కోసం యేటా రూ. 38 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అలాగే భోజనంతో పాటు, ఆస్పత్రుల ఆవరణల్లో శుద్ధమైన త్రాగునీరు, ఫ్యాన్స్, నైట్ షెల్టర్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY