ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా సంవత్సరం కాలం పైగానే ఉన్నా తాజాగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇటీవలే బీజేపీని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు కన్నాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కన్నాతో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు కూడా టీడీపీలో చేరారు. అంతకుముందు గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి 500 కార్లు, 3 వేల మందికి పైగా అనుచరులతో భారీ ర్యాలీగా బయలుదేరిన ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గుంటూరు నగరంలో పలు కూడళ్లలో కన్నా లక్ష్మీనారాయణ ఫోటోలతో తెలుగుదేశం ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన అనుచరులు అనేకమంది టీడీపీలోకి కన్నా రాజకీయ ప్రవేశాన్ని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇక గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కన్నా, తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడాక జనసేనలో చేరొచ్చని అంతా భావించారు. కానీ, ఆయన అనూహ్యంగా సైకిల్ ఎక్కారు. అయితే టీడీపీ అధిష్టానం నుంచి కన్నాకు కావాల్సిన హామీ దక్కిందని, ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు నుంచి పోటీ చేేసే అవకాశం కల్పించడంతో పాటు గుంటూరు వెస్ట్ బాధ్యతలు కూడా అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరారని ప్రచారం జరుగుతోంది. కాగా కన్నాతో పాటు ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా కాపు సామాజిక వర్గ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE