తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం వేకువజామున ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్కీం పనులలో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద భారీ పంపు హౌస్ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ప్యాకేజీ వన్లో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం క్రేన్ సహాయంతో పంపు హౌస్లోకి దిగుతుండగా అకస్మాత్తుగా క్రేన్ వైరు తెగిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా మృతులను బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. వీరిని జార్ఖండ్కు చెందిన సిను, భోలానాథ్.. బీహార్కు చెందిన ప్రవీణ్, కమలేష్, సోను కుమార్ గా గుర్తించినట్లు కొల్లాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ యాలాద్రి తెలిపారు. ప్రాజెక్ట్ పనులలో భాగంగా కార్మికులు సొరంగంలోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు క్రేన్ యొక్క కేబుల్ తెగిపోయిందని, దీంతో కార్మికులు 70 అడుగుల ఎత్తునుంచి లోతైన సొరంగంలోకి పడిపోయారని ఆయన చెప్పారు. కాగా ఇక్కడ సుమారు 100 అడుగుల లోతు సొరంగంలో కాంక్రీట్ పనులు జరుగుతున్నట్లు ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న ఇతర కార్మికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాలాద్రి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ